”సిరివెన్నెల” సీతారామశాస్త్రి

1a5949f6-3528-4195-92f4-32e7830f1d9d 1DF9124 19dd5942-bc4d-4237-9bcb-7f68f04f8aef 26f263c2-7df2-48ca-8759-0894cf7f1dbd 044a5ccb-4f0c-4166-8d27-5f8ac4fa1577 90bd5d24-ebb5-40ac-a1d0-8e28ecd083a7 546b6973-abe4-47cd-b0a3-c48e59c64df0 669fcf2a-107a-46a3-b27f-e826eb8ac365 (1) 669fcf2a-107a-46a3-b27f-e826eb8ac365 8218ed9a-d630-4f19-8399-44e6298507cb 9900b869-e355-4588-9d10-8cf9d1a57efa 01599660-9473-4394-83ca-55490ca11dc4 aa6f6e29-a027-45df-8c9c-d6eb448ddb83 c1de4ee2-3f25-4dab-b47a-204201d94ee3 c28db01a-a028-48c0-9332-32804e0c393b ccbb8aae-1e71-4141-bb6e-1df3e1012255 cf3050ce-9f60-42a7-97f5-a1a780764faa d3eea109-df28-4643-b800-7e8efc60172a fd999ee6-50e9-41a0-ad0d-653ac89dd344 seetaramasastry sirivennela ab sirivennela dc 2 sirivennela dc sirivennela setaramasastry sirivennela
lyricist s sastry 1 sa lyricist s sastry 2 sa

తెలుగు సినీ గీతానికి అసుర సంధ్య అనదగ్గ సమయంలో ఉదయించి సిరివెన్నెల కురిపించిన చందమామ ఆయన.పైకి అందరికీ తేలికగా అర్ధమౌతూనే ఎంతో నిగూఢమైన భావ గాంభీర్యాన్ని కలిగిన కలం ఆయనది. ఆయన పదాల ఎంపిక, వాటి అమరిక లోనే ఆయన గొప్పతనం తెలిసిపోతుంది.

ఆయన వాడే ప్రతి అక్షరం అప్పుడే పుట్టిన పాపాయిలా ఎంతో ముద్దుగా ఉంటుంది
అక్షరం ఆయన కోసమే పుట్టిందా అన్న భావన మనకి కలుగుతుంది.

వాన బొట్టు ఆల్చిప్పాలో పడితేనే ముత్యం అవుతుంది
అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది
అలా శాస్త్రి గారిని ఒడిసిపట్టిన ఆల్చిప్ప విశ్వనాధ్ గారు.
కళకి జీవం తోడైంది అదే జీవకళై సిరివెన్నెలగా మిగిపోయింది.

ఆయనే సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిన చేంబోలు సీతారామ శాస్త్రి. తెలుగు సినీ గీతరచయిత.

విధాత తలఁపున ప్రభవించినది… అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్‌వ్యూ లో చెప్పాడు. ధన మాయ ను ఎంత చిన్న చిన్న పదాలలొ పొదగగలరో దైవ మాయ ని కూడ అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఎర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగు లో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. ఫ్రస్తుత కాలమాన పరిస్ఠితులలో ప్రముఖం గా సినిమా పాటలతో ప్రజలను అలరిస్తున్న ‘సిరివెన్నెల పాటల వల్ల మాత్రమే తెలుగు పాటల్లో లో తెలుగు ఇంకా బ్రతికి ఉంది అంటే అతిశయోక్తి కాదు అంటే ఒప్పుకోని జనాభా తక్కువేమో.

“అడవిగాచిన వెన్నెల” అన్న సామెతని చమత్కారంగా “వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా”అంటూ మార్చిన చమత్కారం..ఆయన సొంతం.”పడమర పడగలపై వెలిగే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరీ తూరుపు వేదికపై వేకువ నర్తకివై రాత్రిని వెలిగించే కాంతులు చిందనీ”అనే భావ గాంభీర్యం ఆయన వరం.

కె.విశ్వనాథ్ వల్ల వెలుగులో కి వచ్చిన చేంబోలు సీతారామ శాస్త్రి “సిరివెన్నెల” సినిమాలో అన్ని పాటలు ఘన విజయాలు సాధించడం వల్ల తేలికగా సినీ రంగం లొ స్థిరపడ్డారు అనుకుంటాము సాధారణం గా.కానీ సిరివెన్నెల తరువాత వచ్చిన అవకాశాలను ఆయన ఉపయోగించుకో లేకపోయారు.అప్పట్లో ఆయన ఇలాంటి పాటలే హిట్టవుతాయనుకునే దర్శకుల వల్లా,అక్కడకక్కడే రాయమనే నిర్మాతల వల్లా చాలా ఇబ్బంది పడ్డారు.మెల్లిగా ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికి రాడనే పేరు వచ్చేసింది .సరిగా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెలలో కమర్షియల్ గా రాస్తూ కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు. దాంతో ఆయనకు కమర్షియల్ బాణీ అలవాటుచేశారు వంశీ. అలా వచ్చిందే లేడీస్ టైలర్. ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందిని ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నరు.అదే ఈవెనింగ్ సిట్టింగ్స్.సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన. అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు.

ఆయన కెరీర్‌ తొలిపాటలో రాసినట్లు ‘విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితి ఈ గీతం’ అంటూ రాజీలేని ధోరణిలో అద్భుతంగా కొనసాగుతోంది. ‘గంగావతరణం’ అనే గేయనాటిక విన్న విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’ చిత్రంకి పరిచయం చేస్తే ఆ గేయ నాటిక విన్న బాలు సీతారామశాస్త్రి సినిమాపాటని పాడకుండానే ”మీవి వందల పాటలు పాడాలని వుంది” అని సీతారామశాస్త్రితో అనడం ఆ మాట ఫలించడం అంటే వందలాది పాటలు బాలు గళం నుంచి వెలువడడం జరిగింది.

సినిమా రచయితగా మారాడానికి ముందే సినారె రచనలను బాగా అభిమానించి ఆరాధనా భావం ఏర్పరుచుకున్న సీతారామశాస్త్రి సినారెని ‘వృత్తి రాతగాడు కాదు వుత్తి రాతగాడూ కాదు’ అని ప్రశంసించారు. అలాగే వేటూరిని కూడా అభిమానించడమే కాదు గురువుగా భావిస్తారాయన అందుకే ‘విశ్వనాథ్‌ వేటూరి నాకు ప్రాత:స్మరణీయులు’ అంటుంటారు.

”సినిమాని చీప్‌ ఆర్ట్‌ గా చాలమంది భావిస్తారు. అలాగే సినిమా కవుల్నీ. సినిమాకవి మామూలు కవి కంటె గొప్పవాడు. పాత్రలోకి ప్రవేశించి పాత్రతో అనిపించగలడు. అయినా సినిమాకి కావ్య గౌరవం సినీ పాటకి సాహిత్య గౌరవం రావడం లేదు” అనే ఆవేదన సీతారామశాస్త్రి వెలిబుచ్చుతుంటారు అప్పుడప్పుడు.

”పాట, పాటలో మాట ఆర్కెస్ట్రాలో భాగమైపోయింది ఇటీవల. అందుకే పాటతో బాటు ఆ పాటలోని మాట వినబడితే ఏమౌతుందో, ఏ కొంప ములుగుతుందో అనే బాధవుంది. సమాజం ఎక్కడ నుంచోరాదు. నానుండి, నా ఇంటినుంచి మొదలవుతుంది అని ప్రతి ఒక్కరూ అనుకుంటే మంచి సమాజం మంచి రచనలు, మంచి సినిమాలు వస్తాయి” అని అంటారు. సీతారామశాస్త్రి సామాజిక బాధ్యత నుంచి తప్పించుకుని వెళ్ళకుండా ఆది నుంచి ఆ బాధ్యతనే పాటలు రాస్తుంటారు అనేది చాలమంది అభిప్రాయం.

అందుకే ఆయన రాసిన తొలి పాట ‘విధాత తలపున ప్రభవించినది’తో ప్రారంభమైన నంది అవార్డ్‌ ‘గమ్యం’ చిత్రం వరకు అంటే 2008 వరకు పదిసార్లు లభించింది. గొప్ప గాయని గాయకులు అద్భుతంగా పాడినపుడు వింటూ ఎలా ఆనందం పొందుతామో చదివినపుడు కూడా అదే ఆనందం పొందగలిగితే అదే గొప్ప పాటగా నిలిచిపోతుందని నమ్ముతారు. అందుకే గొప్ప పాటలు, అద్భుతమైన పాటలు వెలువడుతాయి ఆయన కలం, గళం నుంచి.

“మంగళసూత్రం అంగడిసరుకా కొనగలవా చేజారా”కా అని ఒక్క మాటలో సూత్రం గొప్పతనం చెప్పినా
“ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు” అని జీవిత పరమార్ధం వడపోసినా
“ఎప్పుడు ఒప్పుకో వద్దురా ఓటమి ఎప్పుడు వదులుకో వద్దురా ఓరిమి” అని గెలుపు తలుపుకు దారి చూపినా
“పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం” అని విడాకుల చట్టానికి ఎదురేగి తప్పుని ఎత్తి చూపినా
అది శాస్త్రి గారికి మాత్రమే చెల్లింది .

సాహితీ లోకాన “సిరి” చందనమై సౌరభించిన సగంధుడు
వేల హృదయాల్లో “వెన్నెల”వెలుగై వసించి ఉన్న వరేణ్యుడు
“సిరివెన్నెల”గా కురిసి,మదిమాపులలో మెరిసి
మనసులు గెలిచిన మేధావి
పాటల తోటన విరితావి !
“జగమంతా తన కుటుంబమన్న” తాత్వికుడు
“ఆకాశంలో ఆశల హరివిల్లులు” చూసిన స్వాప్నికుడు
“సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి నిజమడిగిన” ధీమంతుడు
“బోసినోటి తాత కీర్తి భగవద్గీత” గా వినిపించిన బోధకుడు
“పూలబాలల కేల మూణ్ణాళ్ళ ఆయువని” ఆక్రోశించిన ప్రకృతి ప్రేమికుడు
“చంద్రుళ్ళో ఉండే కుందేటిని” నేలకి దింపిన నిజమైన భావుకుడు
“అడగాలనుంది ఒక డౌటుని” అని పసిపాపలా మారాం చేసినా
“సముద్రాన్ని కన్నె పిల్ల కన్నుల్లో కన్నీటి అలలు”గా మార్చినా
“నేననీ నీవనీ వేరుగా లేమని” యువ హృదయాల్ని ఊయలలూపినా
“చెప్పుకోనీవు తప్పుకోనీవు” అని ప్రేమని సున్నితంగా మందలించినా
“జాలిగా జాబిలమ్మ” కి జోలపాడి నిద్రపుచ్చినా
“విరించిలా విపంచిలా” అక్షరాలతో వేణువులూదినా
తనకి ఎవరు రాగలరు సాటి
వింతగా మానసవీణ ను మీటి!
రవళించే రాగాలకు కమనీయపు రూపమిచ్చి
సంగీతపు సంద్రానికి ఉప్పెనలా పొంగునిచ్చి
చిన్ని పూరేకు లాంటి పాటకు చిరు చినుకులా ప్రాణమిచ్చి
అలసిపోని అల మాదిరి
కరిగిపోని కల మాదిరి
ఆగిపోదు ఆ కలం
మూగ బోదు ఆ గళం!!!!!!!!!!

వెన్నెల వెలుగును తనలోనే దాచుకోక అందరికీ పంచిస్తూ
కలకి ఇలకి బేధం చూపి జీవన సత్యం బోధిస్తూ……
అర్ధశతాప్దపు అజ్ఞానాన్నే తరిమేసే ఒక రక్తపు సిందూరమై….
వెలిగిపోతున్న మీకు ఇవే మా సహస్రకోటి వందనాలు….


అంపశయ్యపై సినిమా పాట
పాట చాలామందికి పేరు తీసుకొచ్చింది! పాటకు పేరు తీసుకొచ్చిన అక్షరజ్ఞాని మాత్రం… సిరివెన్నెల సీతారామశాస్త్రి!! ఈ పాట నేను రాశాను – అని చాలామంది రచయితలు కాలర్లు ఎగరేసుండొచ్చు. ‘నన్ను సీతారామశాస్త్రి రాశారు’ అని పాటలే పొంగిపోయి, పరవశించేలా చేసిన ప్రతిభాశాలి.. సిరివెన్నెల సీతారామశాస్త్రి!!ఆయన పాటలు వింటే – రక్తంలో కరెంటుని ఎక్కించినంత ఉత్సాహం, మెదళ్లలో కొత్త భావాల చిగుళ్లు మొలిపించగలిగేంత ఉద్వేగం! ఆయన పాటంటేనే – ఏళ్లకు ఏళ్లు దాచుకుని దాచుకుని మురిసిపోయే జ్ఞాపకం. పాటంటే పరవశం – పాట మాత్రం ఆయన వశం! పాటని పాఠంగా మార్చి, అక్షరంలో అణుబాంబంత విస్ఫోటం సృష్టించగల ధీశాలి.  మూడు వేల పాటలు రాసి – అంతకు లక్షరెట్లు శ్రోతల్ని ఉద్వేగంలో ముంచి, ఉల్లాసపరచిన సీతారామశాస్త్రితో.. పాట గురించి ‘హాయ్‌’ మాట్లాడితే – భావాలు వరదలయ్యాయి.. వెన్నెల తరగలయ్యాయి!!

అంపశయ్యపై సినిమా పాట

* సాధారణంగా పాట పదాల వెంట పరుగులు పెడుతుంటుంది. మీ శైలి చూస్తే.. మీ వెనుకే పదాలు పరుగెడతాయేమో అనిపిస్తుంటుంది. నిజానికి ఈ రెండింటిలో ఏది గొప్ప శైలి?
పదాల వెనుక పాట పరుగెట్టడం ఆరోగ్యకర లక్షణం కాదు. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ ప్రస్తుతం ఇలాంటి ప్రయాణమే సాగుతోంది. భావం వెనుక పదాలు పరుగులు తీయాలి. భావమే తనకు కావాల్సిన పదాల్ని వెదుక్కుంటుంది. అభివ్యక్తి, స్వభావాలు, అనుభవాల భావాల వెనుక పదాలు పరుగెట్టినప్పుడే గొప్ప పాట పుడుతుంది. .

* పాటైనా, కవిత్వమైనా చిరస్థాయిగా మిగిలిపోవాలంటే…?
కవిత్వం అనే మాటలోనే ప్రేమ, అవధుల్లేని ప్రేమ, అపారమైన క్షమ లాంటి దైవిక లక్షణాలుంటాయి. అసలు కవిత్వమంటేనే అది. కవిత్వమూ, ద్వేషమూ ఒకే వేదికపై ఉండడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తిడుతూ రాస్తే కవిత్వం ఎందుకు? ఏ కళకైనా ఓ ప్రయోజనం ఉంటుంది. పాటకైనా, కవిత్వానికైనా భాష చాలా ముఖ్యం. నీ చుట్టు పక్కల ఉన్న వ్యవహార భాషలో ఉంటే మరింత మంచిది

* మీ సినీ ప్రయాణం కె.విశ్వనాథ్‌ గారితో మొదలైంది. మొదటి అడుగుతోనే కళల్ని ప్రేమించిన వ్యక్తి అండ దొరికింది. లేకపోతే మీ ప్రయాణం ఎలా ఉండేది..?
ఆయన లేకపోతే నా మొదటి అడుగే చివరి అడుగు అయ్యేది. సహజంగా నేను కవిని. కవిత్వం కానిది నేను రాయలేను. మొదటి సినిమాలోనే కవిత్వం వ్యక్తపరిచే అవకాశం దక్కింది. అలా కాకుండా వేరేదేదో రాయమంటే నేను రాయలేక వెళ్లిపోయేవాడ్ని. నా తదుపరి ప్రయాణానికీ ‘సిరివెన్నెల’ చాలా దోహదం చేసింది. ‘రుద్రవీణ’, ‘స్వర్ణకమలం’ లాంటి సినిమాలు వెంట వెంటనే రావడంతో నా ప్రయాణానికి ఓ స్థిరత్వం ఏర్పడింది. దాదాపు మూడేళ్ల పాటు నా సహజ ప్రవృత్తికి అనుకూలమైన పాటలు రాసే కథలు దక్కాయి. బతుకు కోసం ఏదైనా చేయాలి, ఏమైనా రాయాలి అనే తాపత్రయం నాకు రాలేదు. నేను రాజీ పడలేదు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో అశక్తుడ్ని. స్త్రీ గురించి హీనంగా, హేయంగా రాయలేను. యువతకు ‘ప్రేమించండి – మిమ్మల్ని ఎవడు అడుగుతాడు? తోచిన దారిలో వెళ్లండి’ అంటూ వెర్రెక్కించలేను.

* కథలు రాశారట.. ఆ అనుభవాలు చెబుతారా?
పదిహేను కథలు ప్రచురితమయ్యాయి. పోస్టులో పంపితే రెక్కలు కట్టుకుని తిరిగి వచ్చేసిన కథలు ముప్ఫై ఉన్నాయి. సగంలో వదిలేసినవి 400 ఉంటాయేమో. కథా రచనలో నా శైలి వేరు. కవితాత్మకంగా, చాలా క్లిష్టంగా ఉంటాయి. కథా నిర్వచనాలకు లొంగవు. అందుకే ఆ యుద్ధం నేను చేయలేదు. ఏడు కథల్ని ఎంచుకుని ‘ఎన్నో రంగుల తెల్లకిరణం’ అని పుస్తకంగా వేశాను.
* మూడు వేల పాటలు రాశారు. మరి మాటలు రాయమని ఎవరైనా అడిగారా?
కొత్తలో అడిగారు. నేను ఒప్పుకోలేదు. మూడు గంటల విషయాన్ని మూడు వాక్యాల్లో చెప్పడం అలవాటు చేసుకున్నవాడ్ని. మూడు వాక్యాల్లో చెప్పాల్సింది మూడు గంటలు చెప్పడమంటే కష్టమేగా..!

* రాత్రి పూటే పాటలు రాస్తుంటారు. చీకటికీ మీకూ ఉన్న సంబంధం ఏమిటి?
చీకటి ఏకాంతం ఎక్కువగా ఇస్తుంది. పాట రాయాలంటే నాలోకి నేను వెళ్తుండాలి. నాతో నేను మాట్లాడుకోవాలి. పోట్లాడుకోవాలి. అలా జరగాలంటే చాలా పొరల్ని దాటుకుంటూ వెళ్లాలి. ఆ సంఘర్షణకు రాత్రి అనువైన సమయం. వయసు మీద పడడంతో ఇప్పుడు రాత్రిపూట మేల్కోవడం తగ్గించా.

* రేపటి పాట ఎలా ఉండబోతోంది?
నేను కోరుకున్న రూపంలోకి పరివర్తనం చెందుతుందనే అనుకుంటున్నా. జీవితానికి ఫుల్‌ స్టాప్‌ ఉండదు. ఓ ప్రళయం వచ్చి… సృష్టి అంతా నశించిపోవడాలు ఉండవు. చేసిన తప్పులు దిద్దుకుంటూ ముందుకెళ్లడమే మార్గం. అలా దిద్దుకోవాలంటే మనిషిని కాదు.. సమూహాన్ని చూడాలి. ఎవరైనా సముద్రం దగ్గర నిలబడి ‘నేను పొట్టి కెరటాన్ని చూశాను, పొడుగు కెరటాన్ని చూశాను..’ అనడు. ‘సముద్రాన్ని చూస్తున్నా’ అంటాడు. మనిషిని కేవలం మనిషిగా చూస్తే చాలా గందరగోళాలు ఎదురవుతాయి. మనుషులందరినీ కలిపి ‘ఓ మనిషి’ అనుకుంటే ఆ సంక్లిష్టత తగ్గుతుంది.

నేనూ, కె.విశ్వనాథ్‌ గారు ఓ సందర్భంలో ‘సినిమాకి పాటలెందుకు?’ అనే చర్చ లేవదీశాం. తన సినిమాల్లో పాటలకు అగ్రతాంబూలం ఇచ్చే విశ్వనాథ్‌ అంతటి వారే.. ‘పాటËలొద్దు’ అన్నారంటే.. ఎందుకని ఆలోచించాలి కదా? మనసు ఆకలి, ఆత్మ ఆకలి తీర్చేది.. కవిత్వం. ఆ అవసరం ఉంటేనే అలాంటి పాటలు రాయాలి. హాలీవుడ్‌లో పాట ఎందుకు కనుమరుగైపోయింది. బాలీవుడ్‌లో పాట రీ రికార్డింగుల్లో ఎందుకు కలిసిపోతోంది? ఎందుకంటే.. పాట జనాలకు నచ్చడం లేదు. అలాంటప్పుడు ఖర్చు ఎందుకు? ఈ ప్రశ్న సినిమా తీసేవాళ్లు వేసుకోవాలి. ఒక్కో పాటకు ఆరు లక్షల నుంచి ఆరు కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు. సినిమా స్థాయిని బట్టి ఈ రేటు మారుతుంది. ఆరు పాటలు లేకపోతే 36 కోట్లు మిగిలిపోయినట్టే కదా! పాటలతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు హిట్టయ్యాయి. ఈమధ్య హిట్టయిన సినిమాల్లో మీకెన్ని పాటలు గుర్తున్నాయి? అంటే పాటలున్నా, లేకున్నా పట్టించుకోవడం లేదనే కదా అర్థం. చెప్పాల్సిన కథ సూటిగా చెప్పు. లేదంటే పాట అవసరమయ్యే స్థాయి కథ తీసుకో.

* సినిమా స్థాయిని పాట పెంచగలదా?
దుప్పటి అవసరమా? కాదా? అనేది గదిలో చలి ఉందా? వేడి ఉందా? అనేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పాటా అంతే. ఇది వరకు పౌరాణిక గాథలు వచ్చేవి. అక్కడ వాడే భాష వేరు, పదజాలం వేరు. సాంఘిక చిత్రాల్లో మనదైన సమస్యలే ఇతివృత్తాలుగా ఉండేవి. ఆయా కథలకు పాటలు అవసరం లేదు. ఉన్నా.. దానికి కవిత్వం అక్కర్లేదు.

తెలుగు సినిమా తాలుకు ప్రస్థానాన్ని జాగ్రత్తగా గమనిస్తే చాలా కాలం వరకూ పాటలో కవిత్వం అవసరం లేదు. అలాగని రాసినవాళ్లంతా కవిత్వం తెలియనివాళ్లా? అంటే అదీ కాదు. పింగళి, సముద్రాల ఇలాంటి మహా రచయితలున్నారు. దేహానికి దెబ్బ తగిలితే మందు కావాలి? ఆత్మకు తగిలితే మందు సరిపోదు. మనసు కావాలి. అప్పుడే కవిత్వం అవసరం అవుతుంది.

‘చిలకా ఏ తోడు లేక’ పాట సాధారణమైన సందర్భంలోంచి పుట్టిన పాట కాదు. ఏ ఆడదీ తన మొగుడిని అమ్ముకోదు. ఆ అవసరం  ఇప్పటి వరకూ రాలేదు. అయినా ఆ పాట నిలబడిందంటే కారణం.. అందులోని భావాలేవో వాళ్లని తడిమాయని అర్థం. ఏ విషయాలు చెబుతున్నాం? ఎంత సార్వజనీనంగా, ఎంత సామాన్యంగా చెబుతున్నాం అనేదే పాట స్థాయిని నిర్ణయిస్తుంది.

అంపశయ్యపై సినిమా పాట

* సినిమాకి పాటే అవసరం లేదు అని ఓ సందర్భంలో మీరే అన్నారు కదా!
పాట అనేది దినుసు లాంటిది. అవసరమైన సందర్భంలోనే వాడాలి. కరివేపాకు కూరలోనే వేయాలి, పాయసంలో ఎందుకు? బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లో పాటలు చూడండి. తిరునాళ్లలోనో, జాతరలోనో కథానాయకులు పాటలు పాడుకునేవాళ్లు. ఎందుకంటే.. వాస్తవ జీవితంలో పాటలు పాడుకునే చోటు అదే కాబట్టి. కొట్టుకోవడం అనేది వాస్తవికంగా ఉండేది. ఇప్పుడు సైన్స్‌ సూత్రాలే తలకిందులైపోయేలా తయారయ్యాయి ఫైట్లు. పాటలూ అంతే. సంగీతం, సాహిత్యం వేర్వేరు ముక్కలు అనుకుంటున్నారు. పసిపాప ఏడుపులో సంగీతం ఉంటుంది, ఆ ఏడుపు ఎందుకోసమో తల్లికి అర్థమవుతుంది. అంటే.. ఆ సంగీతంలోనూ అర్థాలున్నాయనే కదా. కథలు నేలపై ఉన్నంత వరకూ పాటలు బాగున్నాయి. ఎప్పుడైతే నేల విడచి సాము చేశాయో.. అర్థరహితంగా మారాయి. తెలుగు సినిమా పాట అంపశయ్యపై ఉంది. దానికి చికిత్స జరగాలి. ఎలాంటి పాటలు అవసరం అనే చర్చ జరగాలి.

* ‘సినిమా కవిగా ఉండిపోయారు కాబట్టే మీకు రావాల్సిన గుర్తింపు రాలేదు’ అని ఓ సందర్భంలో త్రివిక్రమ్‌ చెప్పారు. మీకూ అలానే అనిపిస్తుంటుందా?
అలా జరిగి ఉంటే, ఇలా చేసి ఉంటే అనే ఊహలకు అర్థం లేదు. మనదారిలో ఏం వస్తే అది స్వీకరించాలి. నువ్వేదో నువ్వు ఒప్పుకో. అది చాలా ముఖ్యం. ఇక్కడ ‘ఏమో’లతో పనేంటి? నేనున్న స్థితిని ఆనందించడం మానేసి ‘అది అయ్యి ఉంటే’ అంటూ చర్చ పెట్టి కాలయాపన చేయడం ఎందుకు? అయితే కొత్తగా వచ్చే గీత రచయితలకు ఓ సలహా ఇవ్వగలను. గీత రచనని మాత్రమే వృత్తిగా నిర్ణయించుకుని రమ్మని నేను చెప్పను. ఇది ఫుల్‌ టైమ్‌ జాబ్‌ కాదు. ఎన్నో పరిమితులమధ్య పాట రాయడం ఈరోజు కత్తిమీద సాము. కవిత్వాన్ని బతుకు తెరువుగా మార్చుకోకండి. సినిమా పాట రాయడానికి నేను పెట్టుకున్న ముద్దు పేరు.. ‘స్వేచ్ఛా బానిసత్వం’. అక్షరం లక్షల అవసరాల్ని తీర్చాలి.

* జాతీయ అవార్డుల విషయంలో తెలుగు పాటకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తారా?
అవార్డుల గురించి పెద్దగా ఆలోచించను. అవార్డు ప్రక్రియలో థియరీ, ప్రాక్టికల్‌ అనేవి రెండుంటాయి. థియరీ రాజ్యాంగాన్ని చదవడమంత తేలిక. ప్రాక్టికల్‌ దాన్ని ఆచరించేంత కష్టం. థియరీ ప్రకారం అవార్డు జ్యూరీది ఎప్పుడూ రైటే. ప్రాక్టికల్‌గా మాత్రం కాదు. నలుగురు కలసి ఓ కమిటీ వేసుకుని, వాళ్ల నియమాల ప్రకారం అవార్డు ఇవ్వడం సాధ్యం కాదు. అసలు ఎవరు నిర్ణయిస్తారు ఇది కవిత్వమని? ఈ యేడాది వచ్చిన పాటల్లోకెల్లా అత్యుత్తమం ఇదే అని చెప్పే సామర్థ్యం ఎవరికి ఉంది? అసలు అంతటి శక్తి ఎప్పటికైనా వస్తుందా? అవార్డు జ్యూరీ ముందుకు రాకుండా అజ్ఞాతంగా ఎక్కడో అంతకంటే గొప్ప పాట ఉందేమో ఎవడికి తెలుసు..? నా వరకూ నేను.. నేను రాసిన ప్రతీ పాటకూ అవార్డు ఇచ్చుకుంటా. ఆ స్థాయి ఉందనుకుంటేనే పాట రాస్తా. లేదంటే రాయను.

* ఓ పుస్తకం చదవడం కంటే.. ఓ వ్యక్తితో ప్రయాణం చేయడం వల్లే ఎక్కువ విషయాలు అర్థమవుతాయి అని మీరే ఓ సందర్భంలో చెప్పారు. ‘ఫలానా వాళ్లతో ప్రయాణం చేయాలి’ అని మీకెప్పుడైనా అనిపించిందా?
ప్రతీ వ్యక్తితోనూ ప్రయాణం చేయాలనే ఉంటుంది. నాకెందుకో గొప్ప వాళ్లు, మంచివాళ్ల కంటే.. చెడ్డవాళ్లు, వంకర వాళ్లు ఎక్కువగా స్ఫూర్తినిస్తుంటారు. వాడెందుకు అలా తయారయ్యాడో తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఓ మనిషి అంటే అతని అనుభవాలు, అతను చదివిన పుస్తకాలు. నా దృష్టిలో ప్రతీ వ్యక్తి 50 పుస్తకాలతో సమానం. అందుకే మనుషులతో మాట్లాడండి. వాళ్ల అనుభవాలు తెలుసుకోండి. చాలామంది చదవడం అనేది ఓ పనిగా పెట్టుకుంటుంటారు. అందుకే అందులోని భావాలు ఎక్కడం లేదు. జీవితంలోని ప్రతి పూట.. ఓ పుట అని మాత్రం తెలుసుకోరు. చదవాల్సివస్తే ఆ పుస్తకం తనకై తాను నీ చేతుల్లోకి వచ్చి వాలుతుంది. అలా చదవాల్సి వచ్చినప్పుడే పుస్తకం చదవాలి. నేను ఓ పుస్తకం చదివి, పక్కన పెట్టానంటే… ఆ పుస్తకం ఖాళీ అయినట్టే అర్థం.

* శ్రోత స్థాయి పెంచిన గీతరచయిత మీరని ఓ సందర్భంలో త్రివిక్రమ్‌ అన్నారు. కలం పట్టుకున్నప్పుడు శ్రోత స్థాయిని దృష్టిలో ఉంచుకుంటారా?
ఫలానా వాళ్ల కోసం ఫలానా రకమైన భాష వాడాలన్న ప్రతిపాదనలేం పాటకు లేవు. అలా అనుకుంటే అది దురుసుతనం దురహంకారం. మనిషికి ఉన్నట్టు భాషకు అంతస్తు, అంతరాలు లేవు. నా దృష్టిలో ఉత్తమ కవిత్వం, చెత్త కవిత్వం అనే విభజన రేఖ లేదు. ‘ఈ పాట నాలుగేళ్ల పిల్లాడికి అర్థమైతే చాలు.. నలభై ఏళ్లవాడు వినకపోయినా ఫర్వాలేదు’ అనుకుని పాట రాయలేను. పాటలో ఎన్నో భావాలుండొచ్చు. శ్రోత తన అవసరాన్ని బట్టి, తన పరిధిని బట్టి, తనకు కావల్సినవి ఏరుకుంటాడు. పసిపిల్లవాడి నవ్వుని రిక్షా తొక్కేవారు ఒకలా, మహారాజు మరోలా ఆస్వాదిస్తారా? నేను ఏ భావాన్నయితే మనసులో ఉంచుకుని పాట రాస్తానో, ఆ భావజాలానికి దగ్గరగా ఉన్న శ్రోత మనసులోకి నా పాట వెళ్తుంది. లేదంటే లేదు.

అంపశయ్యపై సినిమా పాటప్రేమించుకోవడం అనే మాట బహుశా సినిమాల్లోనే వినిపిస్తుందనుకుంటా. సినిమావాళ్లు కనిపెట్టిన పదం అనుకుంటుంటా. నిజానికి నాకు ఈ ప్రేమించుకోవడం అంటే ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు. ‘మేం కామించుకుంటున్నాం’ అని నేరుగా చెప్పలేక ఇలాంటి పదాలు సృష్టించారనిపిస్తుంది.

నా జీవితమే నా గురువు. నా రెండో గురువు తండ్రి. నా మూడో గురువు మాస్టారు. నాలుగో గురువు శివానంద మూర్తిగారు.  నా అయిదో గురువు నాకు నేనే. నాలో ఉన్న ప్రశ్న నాకు పెద్ద గురువు. వీళ్లంతా జీవితాన్ని మలుచుకునే విధానం నేర్పారు. నేను ప్రశ్నని విపరీతంగా ప్రేమిస్తా. అది జవాబుగా మారేంత వరకూ దాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తుంటా. ఎవరేం చెప్పినా వింటా. భగవద్గీత చదువుతూ ‘ఇది శ్రీకృష్ణుడు చెప్పాడు కదా’ అని ప్రతీదానికీ తలాడించను.

ఈరోజుల్లో కవిత్వం గురించి తప్ప దాని ముందున్న విశేషణాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. స్త్రీ కవిత్వం, ముస్లిం కవిత్వం, ఆ వాదం, ఈ వాదం.. ఇవే కదా మనకు కనిపిస్తున్నాయి. దురదృష్టవశాత్తూ అందులో విద్వేషమే ఎక్కువగా కనిపిస్తోంది. వాటిని పాఠాలుగానూ చేర్చేస్తున్నారు. పిల్లలకు మనం బోధించాల్సింది అదా? కవిత్వం పేరిట ఏదైనా రాసేయొచ్చా? ‘కుచ్‌ పానాహైతో కుచ్‌ దేనా సీఖో’ అనేది గుర్తు పెట్టుకోవాలి. ఇవ్వడంలో స్వేచ్ఛ చాలా తక్కువ. నిన్ను నువ్వు పోగొట్టుకుంటే తప్ప ఇవ్వలేవు. అలా ఇవ్వడం నేర్చుకుంటే ఏ గొడవలూ ఉండవు. స్వేచ్ఛ కోసం నీ భావాల్ని ఇష్టమొచ్చినట్టు ప్రకటించే స్వేచ్ఛ నీకు ఎవరిచ్చారు? బ్లూ ఫిల్మ్స్‌ తీసి ఇదే స్వేచ్ఛ అనగలవా? సమాజం ఒప్పుకొంటుందా?  ఏ భావాలు బహిరంగంగా చెప్పాలో, ఏది గుప్తంగా అట్టిపెట్టుకోవాలో రచయితకు తెలియాలి.

* మీ ప్రయాణం కొత్తలో ‘ఎవరైనా మెచ్చుకుంటే బాగుణ్ణు’ అనిపించిందా?
నన్ను నేను మెచ్చుకుంటే బాగుణ్ణు అనుకుంటా. ఎందుకంటే నాలో తీవ్రమైన విమర్శకుడు ఉన్నాడు. ఇప్పటి వరకూ నేను మూడు వేల పాటలు రాశా. అందులో తప్పొప్పులు ఎవరికి అర్థమైనా, అవ్వకపోయినా నాకు తెలుసు. ఈ ప్రయాణంలో నన్ను నేను క్షమించుకోని పాటలు కొన్ని రాశా. కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పులు చేసిన పాటలు కొన్ని ఉన్నాయి. నన్ను నేను మెచ్చుకోవడం నాకు ప్రధానం. శ్రమ పడింది నేను. ఆ పాట కోసం పడిన పాట్లు నాకే తెలుస్తాయి. నొప్పులు పడిన తరవాత బిడ్డ బయటకు రాగానే తల్లి మొహంలో కనిపించే శాంతి… మరొకరు పంచలేరు.. ఇవ్వలేరు. పాటా అంతే.

– మహమ్మద్‌ అన్వర్‌,  ఫొటోలు: జయకృష్ణ