May 20 2020
Producer AV Subbarao
Aug 11 2019
నవీన్: మా ముగ్గురిదీ విజయవాడ. చిన్ననాటి స్నేహితులం. దాదాపు ఒకటే వయసు. మా ముగ్గురి మధ్యనా మరో కామన్ విషయం సినిమా పిచ్చి. స్కూల్ రోజులనుంచీ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. కాస్త పెద్దయ్యాక రిలీజ్ సినిమాలు చూడ్డం అలవాటైంది. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. అది ఉంటేనే ఆటలు సాగుతాయని మాకు తెలుసు. ముగ్గురం వేర్వేరు చోట్ల ఇంజినీరింగ్ చేశాం. ఆ తర్వాత నేనూ, మోహన్ అమెరికా వెళ్లి ఐటీ రంగంలో స్థిరపడ్డాం. రవి హైదరాబాద్లో ఉంటూ వ్యాపారం చేసేవాడు. తన స్నేహితుల్లో కొందరు సినీ నిర్మాణంలో ఉంటే వాళ్లతోపాటు కొన్నాళ్లు జర్నీ చేశాడు. మేం అమెరికాలో 2000 ప్రాంతంలో సొంత ఐటీ కంపెనీలు పెట్టాం. అవి విజయవంతంగా నడుస్తున్నాయి.
మోహన్: మేం ఎక్కడున్నా, ఏ పనిచేస్తున్నా సినిమాపైన ఆసక్తి మాత్రం మాతోపాటు కొనసాగుతూనే ఉండేది. ఓసారి మాటల మధ్యలో అమెరికాలో తెలుగు సినిమాల్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలనే ఆలోచన మా మధ్య చర్చకు వచ్చింది. 2006లో ‘రాఖీ’తో డిస్ట్రిబ్యూషన్ని ప్రారంభించాం. 2017 వరకూ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం. మేం పంపిణీ చేసినవాటిలో అరుంధతి, రోబో, దూకుడు, అత్తారింటికి దారేది… చాలా పెద్ద హిట్లు అయ్యాయి. తెలుగులో వచ్చిన ప్రతి సినిమానీ మేం డిస్ట్రిబ్యూట్ చేయలేదు. మాకు కథ నచ్చితేనో, హీరో-దర్శకుల కాంబినేషన్ బావుంటేనో ఎంపికచేసుకునేవాళ్లం. ఒక ప్రేక్షకుడిగా సినిమా అభిరుచి అక్కడ పనిచేసింది. సినిమా జయాపజయాల ప్రభావం ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్పైనే ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్లో చేతులు కాల్చుకున్న వాళ్ల ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ మేం అక్కడ లాభాలు పొందగలిగాం. కారణం కథల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలే. మేం సినిమాని తీసుకుని అమెరికాలోని వివిధ నగరాల్లో మళ్లీ విడివిడిగా అమ్మేసేవాళ్లం. దానిద్వారా సినిమా ఫలితానికి ముందే మా చేతికి డబ్బు వచ్చేది. కొన్ని నగరాల్లో మా దగ్గరే హక్కులు పెట్టుకునేవాళ్లం. అలా కూడా లాభాల్ని పొందగలిగేవాళ్లం.
రవి: డిస్ట్రిబ్యూషన్ అనుభవంతో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాం. 2013 నుంచి కథ కోసం వేట మొదలుపెట్టాం. ఆ ప్రయత్నంలో కొరటాల శివగారిని కలిశాం. మహేష్బాబు గారితో ఆయన యూటీవీ మూవీస్కి ఒక సినిమా చేయాల్సి ఉంది. ఏవో కారణాలవల్ల ఆఖరి క్షణంలో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అదే ‘శ్రీమంతుడు’. శివగారు ఆ కథ మాకు వినిపించారు. బ్రహ్మాండంగా ఉందనిపించింది. మేం ఇండస్ట్రీకి కొత్త. మాతో సినిమా చేయడానికి మహేష్ ఏమంటారోనని చిన్న సందేహం ఉండేది. సినిమా గురించి మాట్లాడ్డానికి మేం ఆయన్ని రామోజీ ఫిల్మ్సిటీలో కలిశాం. తర్వాత చేయడానికి అంగీకరించారు. ఫిల్మ్సిటీ నుంచి జూబ్లీహిల్స్లోని మా ఆఫీసుకి వచ్చేంతవరకూ అది కలా నిజమా అన్నట్టు అనిపించింది. మహేష్ వెనక ఎంత మంది నిర్మాతలు క్యూలో ఉంటారో తెలియంది కాదు. దానికితోడు మేం దాదాపు ఏడాదిగా కథ కోసమే వెతికాం. అలాంటిది ఏకంగా మహేష్తోనే మొదటి సినిమా ఛాన్స్ వచ్చేసరికి లంకెబిందెలు దొరికినంత సంబరపడ్డాం. ఆ కథ మా దగ్గరికి రావడం, మహేష్ మాతో సినిమాకి అంగీకరించడం… ఇవన్నీ వారంరోజుల్లోనే జరిగిపోయాయి. డిస్ట్రిబ్యూషన్ అనుభవం, నిర్మాతల్లో ఎన్నారైలూ ఉండటంతో ఆయన మా గురించి సందేహించలేదు. డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నపుడూ మహేష్ని తరచూ కలిసేవాళ్లం. అలా ముందునుంచీ పరిచయం ఉండటంతో షూటింగ్ చాలా సాఫీగా సాగిపోయింది. శివ-మహేష్ కాంబినేషన్ తిరుగులేనిది. మేం చేయాల్సిందల్లా సినిమాకి ఏం అవసరమో అది తెచ్చివ్వడమే. అదే చేశాం. ఆ సినిమాకి బడ్జెట్ అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే అయింది. కానీ సినిమా విడుదలకి ముందే అంతకంటే ఎక్కువ బిజినెస్ చేయడంవల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. ‘ఒక మంచి సినిమా తీస్తున్నాం’ అనుకున్నాం. 2015లో వచ్చిన ఆ సినిమాకి మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అలా మొదటి సినిమాతో హిట్ కొట్టడం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
నవీన్: శ్రీమంతుడు సమయంలోనే శివ మాకు ‘జనతా గ్యారేజ్’ కథ చెప్పారు. బాగా నచ్చింది. ఎన్టీఆర్తో సినిమా తీయాలని ముందు నుంచీ అనుకుంటున్నాం. ఆయనకీ కథ నచ్చడంతో వెంటనే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. మొదటి సినిమాతో మా బ్యానర్కు ఒక గుర్తింపు వచ్చింది. రెండో సినిమాలో తేడా జరిగితే, మొదటి సినిమా గాలివాటంలా వచ్చిన హిట్ అనుకుంటారేమోనని ఇంకాస్త జాగ్రత్తగా పనిచేశాం. నిర్మాతగా కథలో మేం వేలుపెట్టలేం. సినిమాలో భారీతనం కోసం ఏదైనా చేయాలనుకున్నాం. అలా మోహన్లాల్గారిని తీసుకొచ్చాం. కొన్ని పాటల్ని భారీ సెట్లు వేసి తీశాం. ‘జనతా గ్యారేజ్’తో మరో విజయం సొంతమైంది.
మోహన్: కథ ఏంటో కూడా అడగకుండా సుకుమార్ గారితో సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆయన మీద మాకున్న నమ్మకం అలాంటిది. అయితే పక్కా కమర్షియల్ సినిమా తీస్తానని సుక్కూ మాటిచ్చాడు. అలా ‘రంగస్థలం’ కథ వినిపించాడు. రామ్చరణ్ని హీరోగా పెట్టాలన్న ఆలోచన ఆయనదే. ఆ సినిమా షూటింగ్ 2017 ఏప్రిల్లో మొదలైంది. గోదావరి జిల్లాల్లోనే చేయాలనుకున్నాం. కానీ ఎండలూ, ఉక్కపోత బాగా ఎక్కువగా ఉండటంతో అక్కడ షూట్ చేసే పరిస్థితి లేకపోవడంతో హైదరాబాద్లో ‘రంగస్థలం’ ఊరు సెట్ వేసి తీశాం. రామ్చరణ్ తన బెస్ట్ నటనని చూపించారందులో…. మొదటిరోజునుంచీ ఆ సినిమా మీద మాకు నమ్మకం ఉండేది కానీ రూ.200 కోట్లు కలెక్ట్ చేస్తుందనుకోలేదు.
రవి: మేం పక్కా కమర్షియల్ సినిమాలే తీయాలని పరిశ్రమలోకి వచ్చాం. కానీ మా మొదటి మూడు సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్తోపాటు మెసేజ్ కూడా ఉండటం యాదృచ్ఛికంగా జరిగింది. అందువల్ల మా బ్యానర్కి మరింత విలువ పెరిగింది. తొలి మూడు సినిమాల్లో ముగ్గురు స్టార్ హీరోలూ, ఇద్దరు గొప్ప దర్శకులూ, ఒక మంచి సంగీత దర్శకుడితో పనిచేశాం. ఆ ఆరుగురినీ మా సంస్థ ఎప్పటికీ మర్చిపోదు. వాళ్లతో మళ్లీ మళ్లీ పనిచేయడానికి ఎదురు చూస్తుంటాం. ఇప్పటికే సుకుమార్- అల్లుఅర్జున్ కాంబినేషన్లో సినిమా ఓకే అయింది. దేవీ ఎంత బిజీ అయినా మా బ్యానర్లో సినిమాకి ఎప్పుడూ ‘నో’ చెప్పలేదు. అంతకంటే ముఖ్యంగా ఆయనిచ్చిన నాలుగు సినిమాల్లోనూ ఒక్కపాట కూడా బాగోలేదనడానికి లేదు. అందుకే ఆయనంటే మాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయనతో మా అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది.
నవీన్: నేను డెట్రాయిట్లో మోహన్ న్యూజెర్సీలో ఉంటాం. మా కుటుంబాలు ఉండేదీ అక్కడే. మాకు సినిమాలు కాకుండా ఇక్కడ ఇతర వ్యాపారాలూ ఉన్నాయి. నెలలో ఒకసారైనా ఇండియా వచ్చిపోతుంటాం. అప్పుడు షూటింగ్ స్పాట్లకూ వెళ్తుంటాం. సినిమా రిలీజ్ సమయంలో మాత్రం నెలన్నరపాటు ఇక్కడే ఉంటాం. ఒక విధంగా అక్కడ ఆరు నెలలు, ఇక్కడ ఆరు నెలలూ ఉంటాం. రవి మాత్రం పూర్తిగా ఇక్కడే ఉంటాడు. ఎక్కడున్నా రోజూ రెండు మూడు గంటలు మా సినిమాల గురించి చర్చిస్తాం. సినిమా రంగంలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. అదృష్టవశాత్తూ మా బ్యానర్లో విజయాల శాతం బావుంది. సక్సెస్ మీట్లు పెట్టినపుడు డిస్ట్రిబ్యూటర్లూ, ఎగ్జిబిటర్లూ వచ్చి సంతోషం వ్యక్తం చేస్తుంటే… ఇంకో హిట్ ఇవ్వాల్సిన బాధ్యత గుర్తొస్తుంది. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కొన్ని సంవత్సరాల తర్వాత మా సినిమాలతోనే తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకో గలిగామని చెబుతుంటారు.
మోహన్: పరిశ్రమలోని అందరు హీరోలూ, దర్శకులతో పనిచేయాలనేది మా అభిలాష. రవి తరచూ కథలు వింటాడు. ఏదైనా కథ బావుందనిపిస్తే మాకు చెబుతాడు. ముగ్గురం కథ విన్నాకే కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్మాణ సమయంలో మాత్రం కొన్నిసార్లు అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటపుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా మిగతా ఇద్దరూ ఆమోదిస్తారు. ప్రతి సినిమా బృందంతోనూ ఎంతో సానుకూల వాతావరణంలో పనిచేస్తాం. హెల్దీ వాతావరణంలో పనిచేస్తే ఫలితం కూడా అలానే ఉంటుందనేది మా నమ్మకం. ఒకసారి కథనీ, దర్శకుణ్నీ నమ్మాక వాళ్లకి ఏం కావాలంటే అది ఇవ్వడమే మా బాధ్యత. సవ్యసాచిలో మాధవన్ ఉంటే బావుంటుందని డైరెక్టర్ అనగానే అంగీకరించాం. రంగస్థలంలో టైటిల్ సాంగ్ని వెయ్యి మందితో భారీగా తీశాం. దాన్ని వందమందితోనూ తీసేయెచ్చు. కానీ దర్శకుడు భారీగా తీద్దాం అనేసరికి మాకూ సబబుగానే అనిపించింది. భవిష్యత్తులోనూ ఇదే విధంగా పనిచేస్తాం.
రవి: ‘అర్జున్రెడ్డి’ని రిలీజ్ రోజునే ముగ్గురమూ చూశాం. ఆఫీసుకి తిరిగొచ్చి దాదాపు నాలుగు గంటలపాటు దాని గురించే చర్చించుకున్నాం. తర్వాత వెంటనే విజయ్ని కలిసి సినిమా తీయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. ‘డియర్ కామ్రేడ్’తో రెండేళ్లు ప్రయాణించాం. అందరూ ఎంతో కష్టపడ్డారు. ఫలితమే ఈ విజయం. మా బ్యానర్లో ఇకనుంచి ఏటా అయిదారు సినిమాలైనా వస్తాయి. నెలకు సగటున పది కథలైనా వింటాం. వాటిలో ఒక్కటి నచ్చినా గొప్ప విషయమే! మేం తీసిన మొదటి మూడూ భారీ బడ్జెట్ సినిమాలు. కానీ పరిశ్రమలో ఇప్పుడు చిన్న, మధ్యస్థాయి బడ్జెట్ సినిమాలు ఎక్కువగా విజయం సాధిస్తున్నాయి. అందుకే మేం కూడా అలాంటి సినిమాలు తీయడం మొదలుపెట్టాం. దానివల్ల భిన్నమైన జోనర్లలో ప్రయోగాత్మక సినిమాలు చేసే అవకాశమూ వస్తుంది. అలా తీసిన ‘సవ్యసాచి’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ‘చిత్రలహరి’ మా నమ్మకాన్ని నిలబెట్టింది. త్వరలో మా బ్యానర్నుంచి నానీ ‘గ్యాంగ్ లీడర్’ వస్తోంది. ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థతో కలిసి సుకుమార్కి అసిస్టెంట్గా చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా ‘ఉప్పెన’ తీస్తున్నాం.
సాయిధరమ్తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ దీంట్లో హీరో. మరో నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
మా విజయానికి కారణం సినిమామీద ఉన్న ఇష్టమే. కథలు వినడం నుంచి స్క్రిప్టులు చదవడం, షూటింగ్కి వెళ్లి పనుల్ని చూడటం, దర్శకులూ హీరోలతో ట్రావెల్ చేయడం దాకా… సినిమా ప్రపంచంలో ఇష్టంగా జర్నీ చేస్తున్నాం. ఆ ఇష్టంలేకుంటే ఇక్కడ విజయం సాధించలేం.
Apr 6 2019
ఆ ఒక్క సినిమా చాలనుకున్నాను!
లక్ష్మీ, లక్ష్యం, రేసుగుర్రం లాంటి మాస్ చిత్రాల నిర్మాత… కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ముకుందా లాంటి యూత్ఫుల్ సినిమాల్నీ ఆయన నిర్మించారు. పిన్న వయసులోనే స్టార్ ప్రొడ్యూసర్గా పేరుతెచ్చుకున్న ఆ నిర్మాత నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి). ప్రస్తుతం నాలుగు సినిమాల నిర్మాణ పనుల్లో ఉన్నారు. నిత్యం కొత్త కథలు వినడంలో బిజీగా ఉండే బుజ్జీని ఆయన కథని చెప్పమంటే ఇలా మొదలుపెట్టారు…
పదో తరగతిలో లెక్కల పరీక్ష తప్పాను. దాంతో ఏడాదిపాటు ఖాళీ. జీవితం గురించి మొదటిసారి సీరియస్గా ఆలోచించింది అప్పుడే. మళ్లీ పరీక్ష కట్టి పాసయ్యాను. మాకో లారీ ఉండేది. నాన్న దాన్ని నడిపేవారు. అమ్మ, నాన్న, అక్క, నేను… ఇదే మా కుటుంబం. కాలేజీలో చేరదామనుకునేసరికి నాన్న చనిపోయారు. దాంతో ఇంటి బాధ్యత నాపైన పడింది. గుంటూరులో మా పక్కింట్లో ఉండే రంగారావుగారు పత్తి విత్తనాల వ్యాపారం చేసేవారు. ఆయన దగ్గర సహాయకుడిగా చేరాను. రెండేళ్లలో కంపెనీలో ఆయన తర్వాత నేనే అన్న స్థాయికి వెళ్లాను. అక్కడ అయిదారేళ్లు పనిచేశాక అలాంటి వ్యాపారం సొంతంగా మొదలుపెట్టాను. బాగానే నడిచేది. ఇప్పటికీ ఆ వ్యాపారం ఉంది. సినీ నిర్మాత బెల్లం కొండ సురేష్ నాకు మేనమామ. విత్తనాల వ్యాపారం చేస్తూనే అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చివెళ్లేవాణ్ని. వ్యాపార పనిమీద కొన్నిసార్లూ, మావయ్య ఇంటికి కొన్నిసార్లూ వచ్చేవాణ్ని. అలా వచ్చినపుడు ఒక్కోసారి సినిమా నిర్మాణ పరమైన పనులు అప్పగించేవారు మావయ్య. అలా 1997లో పరిశ్రమలోకి అనుకోకుండానే అడుగుపెట్టాను. నేను మొదట పనిచేసిన సినిమా ‘సాంబయ్య’. అప్పుడే శ్రీహరి గారితో పరిచయం. ‘అల్లుడూ…’ అని ఆప్యాయంగా పిలిచేవారు. పరిశ్రమలో అందరూ ఆయనలానే ఉంటారనుకునేవాణ్ని. కానీ మెల్లమెల్లగా అర్థమైంది సినిమా ప్రపంచం. ఆ దశలోనే దర్శకుడు వినాయక్ పరిచయం. ‘చెప్పాలని ఉంది’ సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వినాయక్ కో- డైరెక్టర్. వినాయక్, డైరెక్టర్ డాలీ, మిత్రుడు గోపీ, నేనూ రూమ్మేట్స్. జూబ్లీహిల్స్లో ఉండేవాళ్లం.
ఆదితో మొదలు…
నాకు సొంతంగా పనిచేయడమే ఇష్టం. మావయ్య దగ్గర పనిచేశానన్న మాటే కానీ, బాధ్యతలన్నీ నాకే అప్పగించేవారు. నేనేం చేస్తున్నానో చెప్పేవాణ్నంతే! ప్రారంభంలో ‘సాంబయ్య’, ‘వైజయంతి’, ‘మా అన్నయ్య’, ‘చెప్పాలని ఉంది’, ‘రా’ సినిమాలకి పనిచేశాను. ‘రా’కి నిర్మాతగా నా పేరు వేశారు కూడా. సినిమా రంగంలో నా అసలు ప్రస్థానం మొదలైంది ‘ఆది’తోనే. 2001లో వినాయక్, నేను స్విట్జర్లాండ్ వెళ్లాం. ఆ సమయంలో వినాయక్ నా పక్కన లేడు. అక్కడ ఎన్టీఆర్ కనిపిస్తే వెళ్లి పరిచయం చేసుకున్నాను. ‘నా దగ్గర మంచి డైరెక్టర్ ఉన్నాడు. కథ చెప్పిస్తాను వింటారా’ అనడిగితే సరేనన్నాడు. తర్వాత హైదరాబాద్లో కలిశాం. అప్పట్లో వినాయక్ ప్రేమకథలు బాగా రాసేవాడు. మణిరత్నం స్టైల్లో ఉండేవి ఆ కథలు. నాకో ప్రేమకథ చెప్పాడు. కథ బావుంది. ‘ఎన్టీఆర్తో సినిమా అంటే మనకి మంచి అవకాశం. కథ బాగా చెప్పి ఓకే చేయించు వినయ్’ అన్నాను. కథ ఎన్టీఆర్కీ నచ్చింది. తర్వాత ‘స్టూడెంట్ నెం.1’ షూటింగ్ జరుగుతోంది. అక్కడికి మమ్మల్ని పిలిచి ‘మీరు చెప్పిన కథ బావుంది. కానీ మాస్ కథ ఉంటే చూడండి’ అన్నాడు. అప్పటివరకూ మంచి ఉత్సాహంగా ఉన్న మేము గాలి తీసిన బుడగల్లా మారిపోయి రూమ్కి వెళ్లిపోయాం. మర్నాడు ఉదయం నాలుగు గంటలకి నిద్రలేపి వినయ్ ఓ కథ చెప్పాడు. అదిరిందన్నాను. తర్వాత ఎన్టీఆర్కి వినిపించాం. అదే ‘ఆది’. అప్పుడు మేమంతా యంగ్ కదా! ఫుల్ ఎనర్జీతో మనసు పెట్టి కష్టపడి పనిచేశాం. ‘ఆది’… సినిమా కోసం పనిచేసినవారందరూ తమ కెరీర్లకి మంచి పునాది వేసుకున్నారు. తర్వాత బాలయ్య గారితో ‘చెన్నకేశవరెడ్డి’ చేశాం. నిజానికి మావయ్య నిర్మాతగా బాలయ్య అప్పుడు వేరే దర్శకుడితో సినిమా చేయాలి. కానీ వేరే వాళ్లయితే నేను చేయనని చెప్పాను. బాలయ్య పిలిచి కారణం అడిగితే, ‘ఆది’ దర్శకుడితోనే చేద్దామన్నాను. అలా ‘చెన్నకేశవరెడ్డి’ తీశాం. మరో హిట్. ఆ తర్వాత మావయ్య బ్యానర్లోనే ‘కల్యాణరాముడు’ చేశాను.
గుంటూరు వెళ్లిపోయా…
కొన్నాళ్లకు సొంత బ్యానర్ పెట్టి సినిమా తీయాలనుకున్నాను. తేజ దర్శకత్వంలో విష్ణు హీరోగా ఒక సినిమా అనుకున్నాం. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికి కొన్నాళ్ల కిందట మాటల రచయిత ఆకుల శివ నాకో కథ చెప్పారు. ఆయన్ని మళ్లీ పిలిచి ఆ కథ వినయ్కి వినిపించాను. అదే ‘లక్ష్మీ’. వెంకటేష్ గారు హీరో. వినయ్కి కథ మీద నమ్మకం కుదిరింది. సురేష్బాబు గారితో మాట్లాడి ఆ సినిమా నిర్మాణం మొత్తంగా నేనే చేపట్టేలా హెల్ప్ చేయమన్నాడు. సురేష్గారు సరేననడంతో సోలో నిర్మాతగా ‘లక్ష్మీ’ మొదలుపెట్టాను. మా పెద్దమ్మాయి చిన్మయి లక్ష్మి. ఆమె పేరు వచ్చేలా ‘లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ స్థాపించాను. చిన్నమ్మాయి ‘భవ్య’ సమర్పణలో నా సినిమాలు వస్తాయి. ‘లక్ష్మీ’ సినిమా హిట్. ఇన్నాళ్లకు పూర్తిస్థాయి నిర్మాతగా మారి ఒక సినిమా తీశాను. ఇక సినిమాలు చాలనుకొని గుంటూరు వెళ్లిపోయాను. సినిమాల్లో విజయాల శాతం తక్కువ. చాలామంది నిర్మాతల కెరీర్ చివరి దశలో ఏమంత బాగోదు. నిర్మాణ దశలోనూ చాలా సమస్యలు ఉంటాయి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను… ‘లక్ష్మీ’తో ఎంతో కొంత సంపాదించా. జీవితంలో ఆ డబ్బు నిలబెట్టుకుంటే చాలనుకున్నా. గుంటూరులో కొంత స్థలం కొన్నాను. అక్కడ ‘కాటన్ సీడ్ ఆయిల్ మిల్’ పెట్టాలన్నది నా ఆలోచన. అలంకార్ ప్రసాద్ అని నా స్నేహితుడు విజయవాడలో వ్యాపారం చేస్తాడు. నా ప్లాన్ చెప్పాను. బడ్జెట్, టర్నోవర్ అడిగాడు. ‘ఇందులో ఏం మిగులుద్ది. ఇన్నాళ్లు సినీ పరిశ్రమలో ఉండి ఎన్నో నేర్చుకున్నావు. అది వదిలేసి తెలియని ఈ రంగమెందుకు… లాభమో, నష్టమో సినిమాలే తీసుకో’ అని సలహా ఇచ్చాడు. అప్పుడు గుంటూరులో దాదాపు రెండేళ్లు ఉండిపోయాను. తర్వాత ఆలోచన మార్చుకున్నాను. ఆ సమయంలో ‘రణం’ వచ్చింది. గోపీచంద్ చాలా బాగా చేశాడనిపించింది. సరిగ్గా అప్పుడే టీవీలో గ్యాంగ్లీడర్ సినిమా చూశాను. గోపీచంద్ని హీరోగా పెట్టి ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న సినిమా తీస్తే బావుంటుందనిపించింది. దర్శకుడు శ్రీవాస్ నాకో పొలిటికల్ కథ చెప్పాడు. రాజకీయాలు వద్దు కుటుంబ నేపథ్యం ఉన్న కథ ఉంటే చెప్పమన్నాను. మళ్లీ ఆ కథని రత్నం, గోపీ మోహన్ల సాయంతో కొద్దిగా మార్పుచేశాడు. అదే ‘లక్ష్యం’. ‘లక్ష్యం’ మొదలుపెట్టినపుడూ భయమేసింది. సురేష్బాబు గారిని కలిసి కథ వినిపించాను. కథ విన్నాక ‘కలిసి చేద్దాం అబ్బాయ్’ అన్నారు. ఆయనే కలిసి చేద్దామనేసరికి ధైర్యం వచ్చింది. మంచి హిట్. ఆ సినిమాకి బాగా డబ్బు మిగిలింది. ఆ తర్వాత సురేష్గారి తోడ్పాటుతో ‘చింతకాయల రవి’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘నేను నా రాక్షసి’ సినిమాలు తీశాను.
కొంచెం కష్టమైంది….
నాది మొదట్నుంచీ మాస్ టేస్ట్. కానీ ఒక దశలో ఇండస్ట్రీలో యూత్ఫుల్ సినిమాలు బాగా ఆడాయి. అలాంటివి నేనెందుకు చేయకూడదనుకొన్నాను. డాలీని సంప్రదిస్తే ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ కథ చెప్పాడు. సినిమా ఓకే చేశాం. ఆ సినిమాకి చాలా అవార్డులు వచ్చాయి. డబ్బులు మాత్రం పెద్దగా రాలేదు. అప్పుడే మళ్లీ మంచి కమర్షియల్ సినిమా తీయాలనుకున్నాను. దర్శకుడు సురేందర్రెడ్డి ఓ కథ చెప్పాడు. ఆ కథ ఒక వూరి చుట్టూ తిరుగుతుంది. కానీ హీరో ప్రధానంగానే కథ ఉండాలనేది నా పంథా. ఆ దశలో ‘సురేందర్ దగ్గర అన్నదమ్ముల కథ ఉంది ఓసారి విను’ అని ఎన్టీఆర్ నాతో చెప్పాడు. ఆ కథ విన్నాను, నచ్చింది. అదే ‘రేసుగుర్రం’. బన్నీకి కథ నచ్చింది. తర్వాత అరవింద్గారిని కలిశాను. చిరంజీవి గారి తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి బన్నీ అప్పటికే డేట్లు ఇచ్చాడు. మరేం చేద్దామని అడిగారు అరవింద్ గారు… ‘ఏదో ఒకటి చేద్దాం… సినిమా అయితే మొదలుపెడదా’మన్నాను. అలా డాక్టర్ గారితో కలిసి ఆ సినిమా నిర్మించాను. నాకు అన్నదమ్ములు లేరు. కానీ అన్నదమ్ముల బంధం అనగానే ఎమోషనల్గా ఫీలవుతాను. ‘లక్ష్మీ’, ‘లక్ష్యం’ ‘రేసుగుర్రం’ అన్నదమ్ముల కథలే. మనకంటూ కొన్ని భావోద్వేగాలు ఉండాలి. అప్పుడే కథల్ని ఎంపికచేసుకోగలం. అదే సమయంలో నేల మీద ఉండే కథలే నచ్చుతాయి. కథలో అతి ఉంటే నాకు నచ్చదు. ఏదైనా కథ దశలోనే సినిమాపైన నమ్మకం కుదరాలి.
నాలుగు సినిమాలు
రేసుగుర్రం తర్వాత ఠాగూర్ మధుతో కలిసి ‘ముకుంద’ చేశాను. ఆడియో పరంగా, ఇంకా చాలా విధాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. మేం తర్వాత గ్రహించింది ఏంటంటే కథ హీరోది కాదు. స్నేహితుడి ప్రేమకథలోకి వెళ్తాడు. ‘ఖుషి’లో కూడా హీరో స్నేహితుల ప్రేమలోకి వెళ్తాడు. కానీ, కథ మాత్రం హీరోహీరోయిన్ల చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడలా కాదు. డైరెక్టర్ శ్రీకాంత్ ఆలోచనకు విలువిచ్చి ప్రయత్నం చేద్దామని చూశాం. ఆర్థికంగా అంతగా కలిసి రాలేదు. ఈసారి మధు, నేనూ కలిసి వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో మాస్ కథతో ‘మిస్టర్’ సినిమా నిర్మిస్తున్నాం. ఇది కాకుండా గోపీచంద్ మలినేనితో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘విన్నర్’తోపాటు విశాల్ హీరోగా ‘టెంపర్’ని తమిళ్లో రీమేక్ చేస్తున్నాం. వల్లభనేని వంశీతో కలిసి రవితేజ హీరోగా ఒక సినిమా నిర్మిస్తున్నాను. వినాయక్ దగ్గర అసిస్టెంట్గా చేసిన విక్రమ్ సిరి దీనికి దర్శకుడు.
సినిమా నిర్మాణ విధానం మారుతోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలూ మన దగ్గరికి రావడంతో బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. అందుకే భాగస్వామితో కలిసి సినిమా తీయడానికి ప్రాధాన్యమిస్తున్నాను. లాభనష్టాలనే కాదు, తోడుగా మరొకరు ఉంటేనే ఎన్నో విధాల బావుంటుంది. ‘లక్ష్యం’తో పరిశ్రమలో మళ్లీ నిలబడాలి అనుకొన్నాక జాగ్రత్తగా అడుగులు వేయడం మొదలుపెట్టాను. పరిశ్రమలో అనుభవజ్ఞులైన వ్యక్తులతో ప్రయాణిస్తే నేర్చుకునే అవకాశంతోపాటు స్నేహబంధం కూడా ఏర్పడుతుంది. సినిమా నిర్మాణానికి సంబంధించిన అంశాలు చాలా వరకూ మావయ్య దగ్గర తెలుసుకున్నాను. తర్వాత సురేష్బాబు, అరవింద్గార్లలాంటి అనుభవజ్ఞులతో పనిచేస్తూ మరెన్నో నేర్చుకున్నాను. ముఖ్యంగా కథల ఎంపిక, నిర్మాణ వ్యవహారల్లో నాపైన సురేష్ బాబుగారి ప్రభావం ఎక్కువ. పరిశ్రమలో అందరికంటే వినాయక్ నాకు బాగా ఇష్టం. నా మొదటి సినిమా చేశాడు. నేను చేసే ప్రతి సినిమా గురించీ వినాయక్తో చర్చించాకే ముందుకు వెళ్తాను. మేం పరిచయమైన మొదటిరోజు ఎలా ఉన్నామో ఇప్పటికీ అలానే ఉన్నాం. వ్యక్తిగానే కాకుండా డైరెక్టర్గానూ వినయ్ అంటే గౌరవం, నమ్మకం. ఆ నమ్మకంతో ‘వినయ్ నువ్వు ఎప్పటికైనా బి.గోపాల్ అంత డైరెక్టర్ అవుతావ’ని చెప్పేవాణ్ని. ఎగ్జిబిటర్లూ, డిస్ట్రిబ్యూటర్లూ మా బ్యానర్లో వచ్చే సినిమా గురించి ఎంతో ఆసక్తి చూపిస్తారు. నేను కూడా సినిమా బాగా రావడానికి ఎంత ఖర్చయినా వెనకాడను. ఖాళీ దొరికితే అన్ని భాషల సినిమాలూ చూస్తాను. మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను.
మా ఆవిడ… జానకి. వాళ్లది ఖమ్మం. అమ్మ నాతోనే ఉంటుంది. ఈ మధ్యనే హైదరాబాద్లో కొత్త ఇల్లు కట్టాను. సినిమాలతో బిజీగా ఉండటంవల్ల కుటుంబంతో గడిపే సమయం తక్కువ. అమ్మా, మా ఆవిడే పిల్లల చదువులూ, ఇంటి సంగతీ చూసుకుంటారు. ఈ విషయంలో జానకికి ఓపిక ఎక్కువే. నా చిన్ననాటి స్నేహితులు గుంటూరులో ఉన్నారు. పెళ్లిళ్లకీ, శుభకార్యాలకీ పిలిస్తే వెళ్తుంటాను.
Recent Comments